రాజానగరం (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: జాతీయ రహదారిపై నన్నయ విశ్వవిద్యాలయం సమీపంలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాజానగరం సీఐ ఎం.వి.సుభాష్ తెలిపిన వివరాల ప్రకారం.. పిఠాపురానికి చెందిన ఒగ్గు నాగేంద్ర(32) గురువారం పండ్ల కొనుగోలు కోసం తాడేపల్లిగూడెం వెళ్లాడు. అదేరోజు రాత్రి తిరిగి పండ్ల బుట్టలతో గూడ్స్ వ్యానుతో వెళ్తుండా దత్తక్షేత్రం వద్ద ఆగంతకులు అడ్డగించి నాగేంద్రపై కత్తితో దాడి చేసి హత్య చేశారు. వ్యానులో ఉండగానే అతనిపై కత్తితో దాడి చేసి ఉంటారని.. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నాగేంద్ర వ్యాను నుంచి బయటకు వచ్చి జాతీయ రహదారిపై పడిపోయి ఉంటాడన్నారు. హైవే మొబైల్ పోలీసులు గుర్తించి తీవ్ర గాయాలతో ఉన్న నాగేంద్రను జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య లక్ష్మీసత్యదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు.







