ఆయన సతీమణి మధులిక కూడా..
తమిళనాడులోని కున్నూర్ సమీపంలో ఘోర దుర్ఘటన
మొత్తం 13 మంది మృత్యువాత
మృతుల్లో చిత్తూరు జిల్లావాసి సాయితేజ
రాష్ట్రపతి, ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
తీవ్రగాయాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్
చెన్నై (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: నాలుగు దశాబ్దాలకు పైగా భరతమాత సేవలో తరిస్తున్న మేరునగ శిఖరం కూలిపోయింది! భారత తొలి త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ నీలగిరి కొండల్లో నేలకొరిగారు. మాతృభూమి సేవకు సైనిక కళాశాలలో సన్నద్ధమవుతున్న యువ కిశోరాలకు సందేశాన్నిచ్చేందుకు తరలివెళ్లిన ఆయన.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తమిళనాడులోని కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్, ఆయన సతీమణి మధులికతో పాటు మరో 11 మంది కూడా మృత్యువాతపడ్డారు. యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తూ తమిళనాడులో బుధవారం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. త్రిదళాధిపతి (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ (63), ఆయన సతీమణి మధులిక సహా మొత్తం 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో జనరల్ రావత్ దంపతులు సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వెల్లింగ్టన్లోని సైనిక ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన లాన్స్నాయక్ సాయితేజ కూడా ఉన్నారు. ఆయన సీడీఎస్ వ్యక్తిగత భద్రత సిబ్బందిలో ఒకరు. తాజా ప్రమాదానికి పొగమంచే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జనరల్ రావత్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తాజా దుర్ఘటనపై భారత వాయుసేన (ఐఏఎఫ్) విచారణకు ఆదేశించింది







