★ స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్ దర్శనం
★ టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1న, అలాగే, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నట్టు తెలిపింది. వారి సిఫార్సు లేఖల్ని స్వీకరించబోమని టీటీడీ అధికారులు స్పష్టంచేశారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు కొవిడ్ వ్యాక్సినేషన్ లేదా నెగెటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకొని రావాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. శ్రీవారి ఆలయంలో జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా విచ్చేసే భక్తులకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. ఈ పర్వదినాల నేపథ్యంలో జనవరి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు.







