అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: గంగవరం పోర్టు విక్రయంలో డైరెక్ట్ సేల్ విధానాన్ని ప్రభుత్వం ఎందుకు ఎంచుకుందో ప్రజలకు చెప్పాలని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. అయిన వారికి దోచి పెట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మైనర్ పోర్టులను కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గంగవరం పోర్టులో మన రాష్ట్రానికి 10.4శాతం వాటా ఉంది. రుణభారం లేని పోర్టులోని రాష్ట్ర వాటా ఎందుకు అమ్మాల్సి వచ్చింది? లాభదాయక పోర్టులో రాష్ట్ర వాటా ఎందుకు అమ్ముతున్నారు?’’ అని ప్రశ్నించారు.







