కాకినాడ (రెడ్ బీ న్యూస్) 23 అక్టోబర్ 2021: రైస్ మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ) జి.లక్ష్మీశ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఆయన పౌరసరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, ఎఫ్సీఐ, తూనికలు, కొలతలు, రవాణా, కార్మిక శాఖ అధికారులతో ఖరీఫ్లో ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈసారి రైతు భరోసా కేంద్రాల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టనున్నట్లు తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా నూతన విధానంలో కొనుగోలు చేస్తామన్నారు. సచివాలయాలు కేంద్రంగా పనిచేసే వ్యవసాయ సహాయకులు కీలకపాత్ర వహిస్తారని తెలిపారు. గోనె సంచులను ఆర్బీకేల వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. సమీక్షకు సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు లక్ష్మీరెడ్డి, వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్, డీటీసీ మోహన్, తూనికలు, కొలతల శాఖ డీసీ మాధురి, ద్వారంపూడి వీరభద్రారెడ్డి పాల్గొన్నారు.







