Updated 29 January 2022 Saturday 07:00 PM
శ్రీశైలం (రెడ్ బీ న్యూస్):కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై కర్నూలు, ప్రకాశం, గుంటూరు, మహబూబ్నగర్ జిల్లాల అధికారులతో కర్నూలు కలెక్టర్ కోటేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోటేశ్వరరావు అధికారులతో చెప్పారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని అన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్, వసతి సమస్యలు లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు సమన్వయ సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్ కోటేశ్వర రావు. ”బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. గతంలో జరిగిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కావొద్దు. తెలంగాణ జిల్లాలు, ప్రకాశం జిల్లా అధికారులు, దేవస్థానం అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలి. పాగాలంకరణ, శివరాత్రి పండుగ, రథోత్సవానికి రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుండి లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి” అని అధికారులను ఆదేశించారు కలెక్టర్ కోటేశ్వరరావు.
”అన్నప్రసాదం, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పార్కింగ్, ట్రాఫిక్ నిర్వహణ, పోలీసు భద్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, వసతి కల్పన, మెడికల్ క్యాంపులు, తగినన్ని ఆర్టీసీ బస్సుల ఏర్పాటు లాంటి అన్ని అంశాల్లో అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు. కోవిడ్ నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి స్పష్టమైన సూచనలు తీసుకోవాలని ఈఓను ఆదేశించారు కలెక్టర్.







