అమరావతి (రెడ్ బీ న్యూస్) 22 డిసెంబర్ 2021: తన తల్లిపై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులను వదలబోనని.. తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానని చెప్పారు. మంగళగిరిలో లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. గౌరవం కోరుకునే కుటుంబం తమదని.. మీ ఇంట్లో ఉన్న కుటుంబసభ్యులపైనా ఇలాగే మాట్లాడతారా? అని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్ ప్రశ్నించారు. 28వ వార్డులో డంపింగ్ యార్డు తరలించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు లోకేశ్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల్లో గెలిచిన 10 రోజుల్లో డంపింగ్ యార్డును తరలిస్తానని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి 10 రోజులు పూర్తవ్వలేదా? అని నిలదీశారు. సీఎం నివాసముంటున్న నియోజకవర్గంలోనే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే.. రాష్ట్రం పరిస్థితేంటన్నారు.







