UPDATE 18th JUNE 2026 6AM
అమరావతి, రెడ్ బీ న్యూస్, జూన్ 18 : ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ.. పేద ప్రజలకు వైద్యం అందించకుండా గరిష్ఠంగా నాలుగేళ్లుగా విధులకు అనధికారికంగా దూరంగా ఉంటున్న 43 మంది వైద్యులపై శాశ్వత వేటు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బుధవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్) పరిధిలో దాదాపు 118 మంది వైద్యులు విధులకు రాకుండా జలసా చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వీరిలో ప్రాథమికంగా 43 మందిపై చర్యలకు ఉపక్రమించారు.
రాజీనామాల పర్వం.. విచారణకు ఆదేశం
నోటీసులు అందుకున్న తర్వాత డీఎస్హెచ్ డైరెక్టర్ చక్రధర్బాబుకు మరో 34 మంది వైద్యులు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు.
- నిర్లక్ష్యానికి పరాకాష్ట: నాలుగేళ్లుగా విధులకు రాకుండా ఉన్న వైద్యులకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, అభియోగాలు నమోదు చేసినా ఎలాంటి స్పందన లేదు.
- కఠిన నిర్ణయం: ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేయడంతో, వారిని సర్వీసు నుంచి శాశ్వతంగా తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- వీరిలో 15 మంది రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించనుంది.
- మిగిలిన 19 మందిపై జిల్లాల వారీగా విచారణాధికారులను నియమించారు.
- విచారణాధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా వారిపై కూడా తదుపరి చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. విధులను నిర్లక్ష్యం చేసే ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని సర్కార్ హెచ్చరించింది.







