Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై కేసులు అక్రమం.. గొడవలు వైసీపీ పనే: పవన్ కల్యాణ్

UPDATED 17th OCTOBER 2022 MONDAY 06:20 PM

Pawan Kalyan: జనసేన కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టిందని ఆరోపించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడారు.ఈ సందర్భంగా వైసీపీపై విమర్శలు గుప్పించారు. ‘‘జనసైనికులపై అక్రమంగా హత్యాయత్నం కేసులు పెట్టారు. 115 మందికిపైగా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ప్రభుత్వ కేసులపై న్యాయపోరాటం చేస్తున్నాం. ఇప్పటివరకు 70 మందికి స్టేషన్ బెయిల్ తీసుకున్నాం. మిగిలిన వారి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాం. మా పోరాటం అంతా ప్రభుత్వం మీదే తప్ప.. పోలీసులపై కాదు. వైసీపీకి పోటీగా ప్రోగ్రామ్ పెట్టే ఉద్దేశం మాకు లేదు.

అధికార పార్టీ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఎదురెళ్లాలనే దురుద్దేశం మాకు లేదు. జనసేన ఇంటర్నల్ ప్రోగ్రామ్స్ గురించి వైసీపీకి ఎందుకు చెప్పాలి? అమరావతి రాజధాని గురించి ఎవరూ మాట్లాడకూడదన్నదే వైసీపీ లక్ష్యం. మూడు రాజధానుల గురించి ఎవరూ విమర్శించకూడదన్నదే ఆ పార్టీ టార్గెట్. తమిళనాడు, తెలంగాణ నుంచి తరిమేసినా మనకు సిగ్గురాకుంటే ఎట్లా? వైసీపీలో ఎక్కువ శాతం మందికి అడ్డూ, అదుపూ లేదు.వైసీపీ తాటాకు చప్పుళ్లకు ఎవడు భయపడతాడు. రాజకీయమంటేనే భయపెట్టే స్థితికి తీసుకెళ్తే తప్ప వీళ్లంతా కంట్రోల్ కారని వైసీపీ అపోహపడుతోంది. నేను గొడవలు పెట్టుకునే వ్యక్తిని కాదు. రాజకీయాల్లో నిర్మాణాత్మకంగానే గొడవలు పెట్టుకుంటాం.

జనసేనకు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. వైజాగ్ ఎయిర్‌పోర్టులో రెచ్చగొట్టి, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఓ పథకం ప్రకారమే జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు. భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 107 మందిపై హత్యాయత్నం కేసులు పెట్టారు. వైసీపీ వాళ్లు రాళ్లు విసిరేసి, అద్దాలు పగులగొడితే అది భావ స్వేచ్ఛ! జనసేన చేస్తే రచ్చ? ఉన్నతంగా ఉండాల్సిన ఐఏఎస్ అధికారి నాతో గొడవ పెట్టుకున్నారు. ట్రాఫిక్ ఆగిపోయిందంటారు. నా బండి కదలడానికి వీల్లేదని వాళ్లే చెబుతారు. కవ్వించాలి… గొడవ పెట్టుకుంటారు.. తీసుకెళ్లి లోపలేయాలి.. ఇదే వైసీపీ టార్గెట్.ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న వ్యక్తి జగన్. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతానని అనుకున్నారు. కానీ, నేను చాలా సంయమనంతో వ్యవహరించా.

మేం నిర్మాణాత్మక విమర్శలు చేస్తాం. రాజకీయ పార్టీగా మా బాధ్యత మేం చేస్తున్నాం. వైసీపీ కార్యక్రమం పెట్టాకే మేం జనవాణి పెట్టామనడం సరికాదు. వారికి ఇబ్బంది కలిగించాలనే ఆలోచన మాకు లేదు. లా అండ్ ఆర్డర్‌ను సరిగ్గా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏపీలో ప్రభుత్వమే శాంతి భద్రతల సమస్య సృష్టిస్తోంది. విశ్వరూప్ ఇల్లు వాళ్లే తగులబెట్టి, మాపై నెట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రయత్నాలను సమర్ధంగా తిప్పికొట్టాం. విశాఖలో దాడులు జరుగుతుంటే పోలీసులు ఏమయ్యారు? గొడవలు జరగాలనే ఉద్దేశంతోనే ఇదంతా వైసీపీ ప్లాన్ చేసింది’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us