Updated 11th May 2023 Thursday 5:10 pm
Ambati Rayudu met CM YS Jagan: టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై సీఎం జగన్తో రాయుడు చర్చించారు. ఈ సందర్భంగా అంబటి రాయుడికి ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు తెలిపారు.
2019లో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఆశించిన మేరకు రాణించడం లేదు. ప్రస్తుతం రాయుడి వయస్సు 37 సంవత్సరాలు. వచ్చే ఏడాది అతడు ఐపీఎల్ ఆడుతాడో లేదో తెలియదు.
ఈ సంగతి కాస్త పక్కన బెడితే.. తనకు ప్రజా సేవ చేయాలని ఉందని త్వరలోనే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు రాయుడు గతంలోనే ఓ సందర్భంలో చెప్పాడు. తెలంగాణ నుంచి తాను పోటీ చేయనని, ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించాడు. గుంటూరు జిల్లాలో రాయుడు జన్మించాడు. అందుకనే ఏపీ రాజకీయాలపై రాయుడు ఆసక్తి చూపిస్తున్నాడు.
తాను ఏ పార్టీలో చేరనున్నాడు అనే విషయాన్ని రాయుడు ఇంత వరకు వెల్లడించలేదు. అయినప్పటికీ ఫలానా పార్టీలో చేరనున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు జనసేనలో చేరనున్నడనే ప్రచారం జరిగింది. కాదు టీడీపీలోకి వెళతాడు అనే వార్తలు వినిపించాయి. అయితే.. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలుచూస్తుంటే రాయుడు వైసీపీలో చేరుతాడు అనే వాదనకు బలం చేకూరుతోంది.
కొన్ని రోజుల కిందట ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసి ప్రసంగించారు. ఆ స్పీచ్ ను రాయుడు రీ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మీపై విశ్వాసం ఉంది సర్ అంటూ రాసుకొచ్చారు. ఇక ఇప్పుడు సీఎం జగన్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2024లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఐపీఎల్ ముగిసిన తరువాత రాజకీయాలపై రాయుడు ప్రకటన చేసే అవకాశం ఉంది.







