ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను ఉద్దేశించి తమిళనాడు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కొద్ది రోజుల క్రితం ఓ ఆంగ్ల దినపత్రికలోనూ ఇదే విషయమై ఆర్టికల్ రాశారని.. బాధ్యతారాహిత్యమైన ఆయన వ్యాఖ్యలను తమ దృష్టికి తెస్తున్నట్లు రఘురామ లేఖలో పేర్కొన్నారు. గతంలో తమ పార్టీకి చెందిన ఓ పార్లమెంట్ సభ్యుడు ఇలాంటి ప్రకటనలు చేశారని.. ఇప్పుడు జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు చేయడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారని రఘురామ అన్నారు. దీని ద్వారా వ్యూహాత్మకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. వాస్తవానికి న్యాయ వ్యవస్థపై దూషణలు చేసిన వారి జాబితాలో అధికార పార్టీకి చెందిన ఆ ఎంపీ పేరు కూడా ఉందని.. అయితే ఇప్పటివరకు ఆయనపై చర్యలు లేవని లేఖలో గుర్తుచేశారు. జస్టిస్ చంద్రు లాంటి వారి వ్యాఖ్యలు గౌరవనీయమైన సంస్థలపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని రఘురామ అభిప్రాయపడ్డారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్థ గౌరవాన్ని కించపరిచేలా జరుగుతున్న ఈ కుట్రపై సుమోటోగా విచారణ ప్రారంభించాలని అభ్యర్థిస్తున్నట్లు లేఖలో రఘురామ కోరారు.







