అమరావతి (రెడ్ బీ న్యూస్) 26 నవంబర్ 2021: సచివాలయం మొదటి బ్లాక్లో వైకాపా ఎంపీలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. సమావేశం ముగిసిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమావేశం వివరాలు వెల్లడించారు.
‘‘వైకాపాకు ప్రత్యేక సిద్ధాంతం ఉంది, ఏ కూటమిలో లేదు. ప్రజా సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం జగన్ చెప్పారు. పోలవరంపై కేంద్రం వైఖరిని ప్రస్తావించాలని కోరారు. పోలవరం లాంటి ప్రాజెక్టుకు అంశాలవారీ అనుమతులు సరికాదు. డిజైన్ల అనుమతి, నిధుల మంజూరుపై నిలదీయాలని చెప్పారు. సదరన్ కౌన్సిల్లో లేవనెత్తిన 6 అంశాలను ప్రస్తావిస్తాం. పౌరసరఫరాలశాఖకు కేంద్రం రూ.1,708 కోట్లు ఇవ్వాలి. తెలంగాణ రూ.6,112 కోట్ల మేర విద్యుత్ బకాయిలు ఇవ్వాలి. కేంద్రం ఒత్తిడితోనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేశాం. విద్యుత్ బకాయిల చెల్లింపు బాధ్యత కేంద్రానిదే. 2014 నుంచి రూ.22,940 కోట్ల రెవెన్యూ లోటు ఉంది. రెవెన్యూ లోటుపై కేంద్రం తీవ్రమైన అన్యాయం చేస్తోంది. రెవెన్యూ లోటుపై పార్లమెంట్లో లేవనెత్తాలని సీఎం చెప్పారు’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.







