UPDATED 18th JULY 2022 MONDAY 02:10 PM
CM Jagan: ఆంధ్రప్రదేశ్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో సహాయ కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించే పూర్తి బాధ్యతలు సీనియర్ అధికారులు, కలెక్టర్లపైనే ఉన్నాయని చెప్పారు. ప్రజల సమస్యలను సవాళ్ళుగా తీసుకుని పరిష్కరించాలని వారిని సూచించారు.
వరద బాధితులకు 2 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా రూ.2 వేల ఆర్థిక సాయంచేయలేదని అన్నారు.
అలాగే, 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఉల్లిపాయలు, పామాయిల్ అందజేయాలని ఆయన సూచించారు. 48 గంటల్లో బాధితులకు ఇవన్నీ అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ ఉందని ఆయన గుర్తుచేశారు. ఆయా సేవలను వాడుకోవాలని చెప్పారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడానికి యత్నిస్తున్నారని ఆయన అన్నారు.
స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసమే ఇటువంటి పనులు చేస్తున్నారని ఆయన చెప్పారు. ఏపీలో నిధుల సమస్య లేదని అన్నారు. ఏపీలో అవసరమైన ప్రాంతాల్లో శిబిరాలు కొనసాగించాలని ఆయన చెప్పారు. అలాగే, వరద తగ్గుముఖం పట్టిన వెంటనే ఆస్తి నష్టంపై అంచనాలు వేయాలని ఆయన సూచించారు.







