హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: ఆవిష్కరణలు, పరిశోధనలు చేసే సంస్థలను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సుల్తాన్పూర్లోని మెడికల్ డివైజ్ పార్కులోని 7 లైఫ్ సైన్సెస్ ఫ్యాక్టరీలను కేటీఆర్ ప్రారంభించారు. తద్వారా రూ.265 కోట్ల పెట్టుబడిని, 1300 ఉద్యోగాలను ఈ కంపెనీలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రారంభానికి సిద్ధమైన ప్రోమియా థెరపెటిక్స్, హువెల్ లైఫ్ సైన్సెస్, ఆకృతి ఆక్యులోప్లస్ట్రీ, ఆర్కా ఇంజినీర్స్, ఎస్వీపీ టెక్నో ఇంజినీర్స్, ఎల్వికాన్ అండ్ రీస్ మెడిలైఫ్ యాజమాన్యాలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నూతన యూనిట్లలో రాష్ట్రం నుంచి ఇన్ విట్రో డయాగ్నోసిస్, కేర్ డివైసెస్, అనలైజర్లు, ఆక్యులర్ ఇంప్లాట్స్, సర్జికల్, డెంటల్ ఇంప్లాట్స్ వంటి మెడికల్ ఉత్పత్తులను ఈ కంపెనీలు తయారు చేయనున్నాయి. ‘‘నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన మెడికల్ డివైజ్ పార్కులో ఇంత భారీ స్థాయిలో పెట్టుబడి రావటం సంతోషకరం. 2030 నాటికి తెలంగాణ లైఫ్ సైన్సెస్ను వంద బిలియన్ డాలర్ల పరిశ్రమగా మలిచేందుకు ఇదొక కీలక ముందడుగు. ఇందుకోసం ఎగుమతులను తగ్గించుకునేందుకు, కొత్త ఆవిష్కరణలు తీసుకొచ్చే సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కంపెనీల ప్రోత్సాహంతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. మెడ్టెక్ ఆవిష్కరణలకు హైదరాబాద్ కేంద్ర స్థానంగా ఉంది. ఇటీవల ప్రారంభించిన మెడ్ట్రానిక్ సంస్థ ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. రోబోల సాయంతో శస్త్రచికిత్సల దిశగా మెడ్ట్రానిక్ సంస్థ కృషి చేస్తోంది. రోగిని పర్యవేక్షించేందుకు ‘మై కేర్ లింక్ హార్ట్’ యాప్ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా 40 వేల మంది రోగులను ఒకేసారి పర్యవేక్షించవచ్చు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.







