UPDATED 4th APRIL 2022 MONDAY 12:00 PM
AP CM Jagan : ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి జగన్ విజ్ఞాపనలు చేయనున్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాలను సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.
నూతన జిల్లాల ఏర్పాటు విషయంపై ప్రధాని దృష్టికి సీఎం జగన్ తీసుకెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్, పునర్విభజన చట్టంలోని వెనుకబడిన జిల్లాకు నిధులపై మోదీ చర్చించే అవకాశాలు ఉన్నాయి.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు కావాల్సిన నిధుల విషయంలో మోదీ వద్ద జగన్ ప్రస్తావిస్తారని సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షాతో భేటీకి సీఎంవో అపాయింట్ మెంట్ కోరింది. అమిత్ షా అపాయిం ట్ మెంట్ ఓకే అయితే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అమిత్ కు జగన్మోహన్ రెడ్డి వివరించే అవకాశాలు ఉన్నాయి.







