UPDATED 19th FEBRUARY 2022 SATURDAY 08:40 AM
Presidential Fleet Review : విశాఖలో ఫ్లీట్ రివ్యూ, పిఎఫ్ఆర్ కోసం సర్వం సిద్ధమైంది. నేవీ చేసే విన్యాసాల కోసం స్థానికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ బీచ్రోడ్డులో భవనాల యజమానులకు టెన్షన్ మెదలైంది. ఇళ్లకు ఆకర్షణీయమైన రంగులు వేయించాలని ఆదేశాలు జారీ చేశారు. లేకపోతే తామే పేయింట్ వేయించి బిల్లులు వసూలు చేస్తామంటున్నారు జీవీఎంసీ అధికారులు. విశాఖలో ఈ నెల 21 నుంచి మార్చి 4 వరకు తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటికి దేశ, విదేశాల నుంచి వందలాది మంది హాజరుకానున్నారు.
ఈ కార్యక్రమాల్లో 27న బీచ్రోడ్డులో పరేడ్ను నిర్వహించనున్నారు. దీంతో సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా అతిథులను ఆకట్టుకోవాలని జీవీఎంసీ అధికారులు తాపత్రయపడుతున్నారు.
బీచ్రోడ్డు సుందరీకరణ, ఫుట్పాత్ల మరమ్మతులకు 2.5 కోట్లు కేటాయించారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల గోడలకు ఆకర్షణీయమైన రంగులు వేయించాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ భవనాలైతే జీవీఎంసీ ఖర్చుతో రంగులు వేయాలని, ప్రైవేటువైతే వాటి యజమానులతో మాట్లాడి ఎవరికి వారు రంగులు వేసుకునేలా చూడాలని టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.
ఇక కమిషనర్ ఆదేశాలతో టౌన్ప్లానింగ్ అధికారులు బీచ్రోడ్డులో కోస్టల్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ వరకు వంద ప్రైవేటు భవనాల యజమానులను కలిశారు. బీచ్ వైపు గోడలకు రంగులు వేయించాలని సూచించారు. మిలాన్-22 నగర ప్రతిష్ఠకు సంబంధించిన కార్యక్రమమని, సహకరించాలని కోరారు.
ముఖ్యంగా పదమూడు భవనాలు అధ్వానంగా ఉన్నట్టు గుర్తించారు. దీంతో వెంటనే పేయింట్ వేయాలన్నారు అధికారులు. అయితే అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలపై ఆర్థిక భారం మోపడం దారుణమని, జీవీఎంసీ తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవాలంటూ ఆందోళనలు చేస్తున్నారు.







