Vani Jairam: సినీ ఇండస్ట్రీలో ఆగని విషాదాలు.. ప్రముఖ గాయని వాణీ జయరాం కన్నుమూత

Updated 4th February 2023 Saturday 3:20 pm

Vani Jairam: సినీ ఇండస్ట్రీలో గతకొద్ది కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే పలువురు స్టార్స్ మృతిచెందడంతో అభిమానులు తీవ్ర దు:ఖంలోకి వెళ్లిపోయారు. కాగా, నిన్న లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూయడంతో టాలీవుడ్ ప్రేక్షకులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఆయన మరణవార్త నుండి ఇంకా పూర్తిగా కోలుకోకముందే, మరో సినీ సెలెబ్రిటీ మరణవార్త ప్రేక్షకులను దు:ఖంలోకి నెట్టేసింది.

ప్రముఖ సినీ గాయని వాణీ జయరాం చెన్నైలోని ఆమె స్వగృహంలో కన్నుమూసినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదు దశాబ్దాలుగా సినీ సంగీత ప్రియుల్ని తన మధురగానంతో ఓలలాడించిన ఈ నేపథ్య గాయకురాలి గొంతు మూగబోయిందనే వార్తతో అభిమానులు దు:ఖసాగరంలోకి వెళ్లిపోయారు. పదేళ్ల వయస్సులోనే తొలిసారి ఆల్ ఇండియా రేడియాలో పాటలు పాడిన వాణీ జయరాం, 1970లో ‘గుడ్డీ’ చిత్రంలో తొలిపాటను పాడారు. ఆమె ఆలిపించిన తొలిపాటకే తాన్‌సేన్‌తో పాటు మరో నాలుగు అవార్డులను అందుకున్నారు. ఇక తెలుగు శ్రోతలను ‘అభిమానవంతుడు’ అనే సినిమాలోని పాటలతో పలకరించింది వాణీ జయరాం. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగళ్ చిత్రానికి జాతీయ పురస్కారం అందుకున్న వాణీ జయరాం.. ‘శంకరాభరణం’ చిత్రంలోని మానస సంచరరే పాటకు రెండోసారి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

‘స్వాతికిరణం’ చిత్రంలోని ‘‘ఆనతినియ్యరా హరా..’’ పాటకు మూడోసారి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆమె నేపథ్యగాయనిగా 50 ఏళ్ల సినీ జీవితాన్ని ఇటీవల విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఆమె కెరీర్‌లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఉర్దూ, మరాఠీ, బెంగాలీ, భోజ్‌పురి, ఒరియా భాషలతో పాటు మొత్తంగా 18 భాషల్లో పాటలను పాడారు. దాదాపు వేయి సినిమాల్లో 10 వేల పాటలను పాడారు. ఇటీవల ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. వాణీ జయరాం మరణవార్త గురించి తెలుసుకున్న ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us