UPDATED 20th FEBRUARY 2022 SUNDAY 07:20 PM
Pawan Kalyan Public Meeting At Narsapuram : మత్స్యకారుల జీవన పరిస్థితులను దెబ్బతీసేలా ఉన్న జీవో నెంబర్ 217 వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. వీరికి వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోను చింపేస్తున్నట్లు, దీనిపై కేసులు పెట్టి జైలుకు పంపినా తాను సిద్ధమేనని ప్రకటించారు. ప్రభుత్వ బెదిరింపులకు జనసేన భయపడదని, సంయమనం పాటిస్తున్నామంటే అది తమ బలమన్నారు. తాను ఎలా పడితే అలా మాట్లాడి రెచ్చగొట్టనని, అక్రమ కేసులు బనాయించి హింసిస్తే రోడ్డుపై తెగించి నిలబడుతానని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2022, ఫిబ్రవరి 20వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ జరిగింది. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని మత్స్యకారులనుద్దేశించి ప్రసంగించారు.
10 మంది ఎమ్మెల్యేలుంటే..
జనసేనకు 10 మంది ఎమ్మెల్యేలు ఉండి ఉంటే 217 జీవో ఇచ్చేందుకు ప్రభుత్వం సాహసించేది కాదని, మరబోట్లు రాకముందు సముద్రమంతా మత్స్యకారులదేనని తెలిపారు. చట్టాలు, మరబోట్లతో మత్స్యకారులకు హద్దులు పెట్టారని విమర్శించారు. మత్స్యకారులకు ఆర్థిక ప్రగతి రాకపోవడానికి కారుకులెవరని ప్రశ్నించారు. లేని సమస్యను సృష్టించడంలో వైసీపీ ముందుంటుందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతారని, వైసీపీ నేతలు వైన్ షాపులు పెట్టుకున్నారు.. ఆపక్కనే మటన్, చికెన్ కొట్టులు కూడా పెట్టుకోండని విమర్శించారు. మటన్ కొట్లు పెట్టుకోవడానికి, చేపలు అమ్ముకోవడానికేనా పాదయాత్రలు చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మటన్ కొట్టు, చేపల కొట్టు పెట్టుకోవాలనే ఆసక్తి లేదని సెటైర్ వేశారు.
మత్స్యకారుల పొట్ట కొట్టడానికే జీవో..
చట్టాలు అమలయ్యేలా ప్రభుత్వం మెడలు వంచుతామని, దోపిడీ చేసే చట్టాలను ఉల్లంఘించాలని గాంధీనే చెప్పారనే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారులు తనకు అండగా నిలవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా కపాసకుద్ధి గ్రామంలో గంగమ్మ తల్లి పూజ చేసి పోరాట యాత్ర మొదలుపెట్టడానికి కారణం గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవడానికి, మీకు అండగా నిలబడటానికేనని స్పష్టం చేశారు. అసలు సమస్యే లేని చోట సమస్య సృష్టించగలిగే ఉద్దండులు వైసీపీ నాయకులంటూ ఎద్దేవా చేశారు. వారే లేని సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించాం అంటారని, మత్స్యకార కుటుంబాల నుండి వచ్చిన బొమ్మిడి నాయకర్ లాంటి బలమైన వ్యక్తి ఓడిపోయినా సరే బలంగా ప్రజల మధ్యన ఉన్న వ్యక్తి అని ప్రశంసించారు. సముద్రంలో వేటకు వెళ్లి చేపలు పట్టుకునే మత్స్యకారుల పొట్ట కొట్టడానికి ఈ జీవో 217 తీసుకొచ్చారని వెల్లడించారు.
మార్చి 14వ తేదీన..
ఒక ఎమ్మెల్యే కూడా లేని జనసేన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తున్నట్లు, అలాంటిది మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతే లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకు బీమా ఇవ్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఎంతో ధైర్యంగా సముద్రంలో వేటకు వెళ్లే ఇలాంటి సాహస వీరులకు తాను అండగా ఉంటానని మరోసారి తెలిపారు. మత్స్యకారుల అందరి భవిష్యత్తు కోసం వచ్చామని తమను రెచ్చగొట్టాలని, భయపెట్టాలని చూడవద్దని, మార్చి 14వ తేదీన మళ్లీ ఇక్కడ కలుద్దామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మత్స్యకారులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.







