Updated 6th April 2023 Thursday 6:25 pm
YS Jagan Mohan Reddy : విపక్ష పార్టీల నేతలపై సీఎం జగన్ విరుచుకుపడ్డారు. స్కామ్ లు తప్ప స్కీములు తెలియని బాబులు, సామాజిక న్యాయం తెలియని పరాన్నజీవులు అంటూ ఫైర్ అయ్యారు జగన్. చిలకలూరిపేట లింగన్ గుంట్లలో ఏర్పాటు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. ప్రతిపక్షాలపై మండిపడ్డారు జగన్. తనను ఎదుర్కోలేక తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయని అన్నారు. ఎత్తులు, జిత్తులు, పొత్తులు, కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. తనకు మాత్రం పొత్తులు లేవన్నారు జగన్. పొత్తంటూ ఉంటే.. అది కేవలం ప్రజలతోనే అని చెప్పారు. నవరత్నాలతో మీ బిడ్డ వస్తుంటే.. తోడేళ్లన్నీ ఒక్కటవుతున్నాయన్నారు. వాళ్లలా తనకు ధనబలం, అంగబలం లేదన్నారు. తనకు దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలు మాత్రమే ఉన్నాయన్నారు.(YS Jagan Mohan Reddy)
వైద్యం, ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం:
ఆరోగ్యశ్రీ పథకం పేరు వినగానే వైఎస్ఆర్ గుర్తుకొస్తారని సీఎం జగన్ అన్నారు. ఖరీదైన కార్పొరేట్ పథకాన్ని పేదలకు అందించిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందన్నారు. అలాంటి గొప్ప పథకాన్ని వైఎస్ఆర్ చనిపోయాక నీరుగార్చారని జగన్ వాపోయారు. పేదల ప్రాణం విలువ తెలిసిన ప్రభుత్వం తమది అని జగన్ చెప్పారు. అందుకే వైద్యం, ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడబోమన్నారు.
చంద్రబాబు పెట్టిన ఆరోగ్యశ్రీ బకాయిలను సైతం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు జగన్. ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి రూ.3వేల 300 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఇప్పటిదాకా రూ.9వేల కోట్లు ఖర్చు చేశామని, అలాగే ఆరోగ్య ఆసరా కోసం రూ.980 కోట్లు ఖర్చు చేశామని సీఎం జగన్ తెలిపారు.
ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్.. లింగన్ గుంటపల్లిలో ప్రారంభించారు. ఈ కాన్సెప్ట్ ద్వారా.. ప్రజలు తమ ఇంటి వద్దే వైద్య సేవలు పొందవచ్చన్నారు. పెన్షన్ స్కీమ్ లో ఎలాగైతే లబ్దిదారులకు ఇంటికొచ్చి పెన్షన్లు ఇస్తున్నారో అదే విధంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా వైద్య సేవలు ఇంటి వద్దే అందుతాయన్నారు.(YS Jagan Mohan Reddy)
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్.. దేశం మొత్తానికి ఓ రోల్ మోడల్ అవుతుందన్నారు జగన్. అంతేకాదు ప్రతి రాష్ట్రం ఈ కార్యక్రమాన్ని కాపీ చేసి ఆచరణలోకి తెస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని జగన్ అన్నారు. నడవలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైన పేషెంట్లకు.. ఇంటి వద్దకే వైద్యసేవలు అందుతాయన్నారు.
విలేజ్ క్లినిక్స్ లో 14 రకాల మెడికల్ టెస్టులు అందుబాటులో ఉంటాయన్నారు. 105 రకాల మందులు అందిస్తామన్నారు. దానికి అదనంగా ప్రతీ మండలానికి రెండు ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉంటాయని, ప్రతి పీహెచ్ సీలో ఇద్దరు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.







