UPDATED 21nd JULY 2017 FRIDAY 9:00 PM
కాకినాడ: పేదలకు అవసరమైన విద్య, వైద్యానికి దుర్గా సోము ప్రసాద్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక తిలక్ వీధిలో గల ఎస్ ఆర్ కె మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్, శారదా స్పెషల్ కార్పొరేషన్ ఎలిమెంటరీ స్కూల్ కు చెందిన సుమారు 600 విద్యార్థులకు శుక్రవారం నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమ ప్రాంతంలో సోము ప్రసాద్ సేవలు అందించారని, జిల్లా పరిషత్ చైర్మన్ గా తాను తొలిసారి ఈ ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరడమే ట్రస్ట్ కు నిజమైన కృతజ్ఞతలు తెలపడమన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ట్రస్ట్ చైర్మన్ సోము ప్రసాద్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా నిరంతరంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, పేదల విద్యకు, వైద్యానికి ఎల్లపుడూ ప్రాధాన్యత ఇచ్చామని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో బాధితులను ఆదుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ వి. రాజ్ కుమార్, ట్రస్టీ సోము స్వాతి, హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీదేవి, ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు దమయంతి, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







