UPDATED 23 JANUARY 2022 SUNDAY 11:00PM
★ స్టాక్ ట్యాంక్లోకి దిగి ఊపిరి ఆడక మృతి చెందిన కార్మికుడు
★ న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళనకు దిగిన మృతుని బంధువులు
★ వాలుతిమ్మాపురంలో ఘటన
★ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించిన ఫ్యాక్టరీ యాజమాన్యం
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం గ్రామంలో ఉన్న సైరస్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ ఒక కార్మికుడు మృతి చెందడంతో మృతదేహంతో అతని బంధువులు ఆదివారం ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. జి.రాగంపేట గ్రామానికి రాచపల్లి పృథ్విరాజ్ (43) సైరస్ పరిశ్రమలో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. శనివారం నైట్ షిఫ్ట్ డ్యూటీలో ఉండగా ఫ్యాక్టరీలో స్టాక్ ట్యాంక్లోకి దిగడంతో ఊపిరి ఆడక చనిపోయాడు. ఈ విషయం తెలియడంతో ప్రజాసంఘాలు, గ్రామస్థులు, మృతుడి బంధువులు ఆదివారం ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మృతదేహంతో ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కేవలం ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే పృథ్విరాజ్ మృతిచెందాడని బంధువులు ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చివరికి ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించి నష్టపరిహారాన్ని చెల్లించేందుకు అంగీకరించడంతో ఆందోళనను విరమించారు.







