UPDATED 7th MARCH 2022 MONDAY 07:30 AM
AP Assembly Budget Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2022, మార్చి 07వ తేదీ సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏపీలో హాట్ టాపిక్గా మారాయి. తొలుత సభకు రావొద్దని అనుకున్న టీడీపీ.. మూడు రాజధానులపై కోర్టు తీర్పుతో సభకు హాజరు కావాలని నిర్ణయించింది. చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులంతా సభకు హాజరవుతారు.
మూడు రాజధానులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.మూడు రాజధానులపై వెనక్కి తగ్గేదిలేదని పదేపదే ప్రకటిస్తోన్న వైసీపీ అసెంబ్లీ వేదికగా చర్చ జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. దీనిపై న్యాయ సలహాలు తీసుకుంటోంది.
మూడు రాజధానులపై తీర్మానం చేసి కేంద్రానికి పంపాలా లేక.. కొత్త బిల్లు పెట్టాలా అన్న విషయంపై కసరత్తు చేస్తోంది అధికార పార్టీ. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సభలో వివరించడంతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధిని ప్రజల ముందు పెట్టాలని వైసీపీ యోచిస్తోంది. ఇరిగేషన్, మహిళా భద్రత, వ్యవసాయ రంగం, వైద్య రంగం, విద్యా వ్యవస్థ లో తీసుకువచ్చిన మార్పులు, గృహ నిర్మాణాలు వంటి కీలక అంశాలపై చర్చ జరపనుంది.
టీడీపీ సభకు వస్తుండటంతో వారి ఆరోపణలను దీటుగా తిప్పికొట్టాలని సీఎం జగన్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు సూచించారు.







