హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 14 డిసెంబర్ 2021: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. గీతా జయంతి సందర్భంగా లక్ష మంది యువతీ యువకులతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా యువతీ యువకులు భగవద్గీతలోని 40 శ్లోకాలను పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామీ, రామజన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్గిరి మహారాజ్ హాజరయ్యారు. అనంతరం త్రిదండి చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ.. ‘‘భగవద్గీత ఆవిర్భవించి లోకాన్ని చూసిన రోజు ఇది. భగవద్గీతలోని సందేశం మనకెప్పుడూ కొత్తే. మనందరం బాధ్యతలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కర్తవ్య నిర్ణయ బాధ్యత సమాజంలో అందరిపైనా ఉంటుంది. మన దేశాన్ని విశ్వ గురువుగా మార్చాలని అందరూ భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ‘ఇది మనది’ అనే విశ్వాసాన్ని కోల్పోయాం. శ్రీకృష్ణుడు ఆదేశించినట్లు నువ్వు ఎవరో తెలుసుకొని పని చేయాలి. అర్జునుడిలా మనం అందరం సంసిద్ధత పొందుతున్నాం. భారతదేశపు విధానాలను ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తున్నాయి. మనం మాత్రం పుక్కిటి పురాణాలని చిన్న చూపు చూస్తున్నాం. మన ధర్మాన్ని తరువాత తరాలకు అందించేలా సన్నద్ధం కావాలి. మన పెద్దలు అందించిన గ్రంథాలను ఆక్షేపించకుండా సందేహాలను నివృత్తి చేసుకుందాం. ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉంది’’ అని పేర్కొన్నారు.







