UPDATED 26th MAY 2022 THURSDAY 06:00 AM
AP ministers bus yatra : ఎన్నికలకు రెండేళ్లు ఉన్నా.. ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే.. వైసీపీ సర్కార్ మరో యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇవాళ్టి నుంచి సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర చేపట్టనుంది. సిక్కోలు నుంచి అనంతపురం వరకు నాలుగు రోజుల పాటు ఈ బస్సు యాత్ర జరగనుంది.
వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు జరిగిన సామాజిక న్యాయాన్ని బస్సుయాత్ర ద్వారా ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేసింది.శ్రీకాకుళం జిల్లా నుంచి.. అనంతపురం వరకు 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మంత్రులు బస్సు యాత్ర చేయనున్నారు. వైసీపీ సర్కార్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన సామాజిక న్యాయం, పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ యాత్ర సాగనుంది.
స్థానిక సంస్థల నుంచి రాజ్యసభ వరకు రాజకీయ పదవులు.. ఆయా వర్గాలకు ఏ విధంగా న్యాయం జరిగిందో వివరించనున్నారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రను విజయవంతం చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు.ముందుగా అరసవెల్లి సూర్యనారాయణస్వామిని మంత్రుల బృందం దర్శించుకుంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్, బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్రామ్, జ్యోతిరావుపూలే, కోమురంభీం, అబ్దుల్ కలాం అజాద్ విగ్రహాలకు పూలమాలలు వేసి.. యాత్ర ఉద్దేశాన్ని వివరించి ఏడు రోడ్ల జంక్షన్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.
మొదటి రోజు శ్రీకాకుళం, ఎచ్చెర్ల, రణస్థలం, పూసపాటిరేగ, నాతవలస జంక్షన్, డెంకాడ మీదుగా విజయనగరం చేరుకోనుంది. అక్కడ బహిరంగ సభ అనంతరం విశాఖకు బయల్దేరుతుంది.







