UPDATED 7th NOVEMBER 2022 MONDAY 6:10 PM
CM Jagan : కనీస మద్దతు ధర కంటే (MSP) తక్కువ ధరకు పంటను అమ్ముకున్నామన్న మాట రైతుల నుంచి రాకూడదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) పేర్కొన్నారు. సోమవారం ఆయన వ్యవసాయశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై ఆయన ఉన్నతాధికారులకు సూచనలు చేశారు.
‘‘ఎంఎస్పీ (మినిమమ్ సపోర్టు ప్రైజ్) కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట రైతుల నుంచి ఎక్కడా రాకూడదు. దీన్నిఅధికారులు సవాల్గా తీసుకోవాలి. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర తీసేస్తున్నాం. రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందేలా ధాన్యం సేకరణ చేయాలి. ఇ - క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో ధాన్యం సేకరణ చేయాలి. వ్యవసాయశాఖతో పౌరసరఫరాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా చర్యలు తీసుకోవాలి. రబీకి అన్నిరకాలుగా అధికారులు సిద్ధం కావాలి. ఎరువులు, విత్తనాలతో సిద్ధంగా ఉండాలి. నవంబరు 29వ తేదీ సున్నావడ్డీ పంట రుణాలతో పాటు ఇన్పుట్ సబ్సిడీని జమ చేయాలి. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్ను ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేయాలి.
వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండాలి. కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ల ద్వారా ఇచ్చిన వ్యవసాయ యంత్రసామగ్రి అంతా రైతులకు అందుబాటులో ఉంచాలి. రైతులందరికీ వీటి సేవలు అందాలి. భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలి. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలి.’’ అని సూచించారు







