UPDATED 24th JULY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంటే టిడిపి హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని నాలుగేళ్లు కాలం వెళ్లదీసి మళ్లీ యూటర్న్ తీసుకొని ప్రజల్ని మోసం చేసే పన్నాగం పన్నుతోందని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సిపి ఇన్చార్జ్ తోట సుబ్బారావు నాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్సిపి రాష్ట్ర అధిష్టానం పిలుపుమేరకు పట్టణంలో మంగళవారం ప్రత్యేక హోదా సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం అయింది. నియోజకవర్గంలోని పెద్దాపురం పట్టణం నుంచి ప్రారంభమైన ర్యాలీ సామర్లకోట ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, మెహర్ కాంప్లెక్స్, మఠం సెంటర్ మీదుగా స్టేషన్ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ టిడిపి, బిజెపిలు రాష్ట్ర ప్రజలను మోసం చేశాయన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాయితీలు వచ్చి అధిక సంఖ్యలో పరిశ్రమలు నెలకొల్పబడి యువతకు ఉద్యోగవకాశాలు పెరుగుతాయన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తూ వైఎస్సార్సిపి అధినేత జగన్ మోహన్రెడ్డి విభిన్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతారన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి ఎంఎల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ నాయకులు ఆవాల లక్ష్మీనారాయణ, కాళ్ల లక్ష్మీనారాయణ, మద్దాల శ్రీను, సేపేని సురేష్, కానుబోయిన విజయకృష్ణ, గంప శివ, తదితరులు పాల్గొన్నారు.







