పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 25 అక్టోబరు 2021: ప్రభుత్వ అనుమతి లేకుండా ఆక్రమించిన, అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు ఆర్డీవో పి.వెంకటరమణ తెలిపారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నివాస గృహాలు నిర్మించుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. ఆక్రమణ చేసుకున్న భూమి 75 చదరపు గజాల వరకు ఉంటే క్రమబద్ధీకరణకు భూమి బేసిక్ వాల్యూపై 75శాతం మొత్తం చెల్లించాలని, ఒకవేళ సిక్స్స్టెప్ వేలిడేషన్లో అర్హులైతే డీ.ఫారం పట్టా పొందడానికి అర్హులని, వీరికి పట్టా ఇస్తామన్నారు. ఎటువంటి మొత్తం చెల్లించాల్సిన పనిలేదన్నారు.75 చదరపు గజాలు పైబడి 150 చదరపు గజాల వరకు ఉంటే భూమి బేసిక్ వాల్యూపై 75 శాతం చెల్లించాలన్నారు. 150 నుంచి 300 చదరపు గజాల వరకు అయితే భూమి బేసిక్ వాల్యూపై 100 శాతం చెల్లించాలని ఆయన తెలిపారు. క్రమబద్ధీకరణకు 15.10.2019కి ముందు ఆక్రమణ చేసుకున్న భూమి నివాసగృహమై ఉండాలన్నారు. కొన్ని భూములకు మినహాయింపు ఇచ్చామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు ఆదాయం కలిగి ఉండి రేషన్కార్డు పొందే అర్హత కలిగి ఉండాలన్నారు. రిజిస్టర్ డాక్యుమెంట్లు, ప్రాపర్టీ ట్యాక్స్, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు తదితర ఆధారాలు కలిగి ఉండాలన్నారు. డిసెంబరు 31లోగా గ్రామ/వార్డు సచివాలయాల్లో ధరఖాస్తు చేసుకోవాలని ఆర్డీవో కోరారు.







