UPDATED 8th NOVEMBER 2022 TUESDAY 1:20 PM
Pawan kalyan: గుంటూరు జిల్లా ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కూల్చివేతకుగురైన బాధితులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. వారికి ఆర్థికంగానూ చేయూతనందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు రూ. లక్షల రూపాయల వంతున సాయం అందించేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో వైపీ ప్రభుత్వం దాష్టీకానికి ఇళ్ళు దెబ్బ తిన్నవారు ఆవాసాలు కోల్పోయారని, పవన్ కళ్యాణ్ బాధితులకు లక్ష రూపాయలు సాయం ప్రకటించారని తెలిపారు. తన వంతున ఆర్ధికంగా అండగా నిలబడాలని జనసేన అధినేత నిర్ణయించారని తెలిపారు.
జనసేన ఆవిర్భావ సభకు ఇప్పటం వాసులు సహకరించారని, సభా స్థలిని ఇచ్చారని కక్షగట్టి ఇళ్లను కూల్చడం దుర్మార్గమని నాదెండ్ల వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జేసీబీలను పెట్టి, పోలీసులను మోహరింపచేసి అరెస్టు చేయించారన్నారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైందని నాదెండ్ల మనోహర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.







