Updated 17th February 2023 Friday 7:55 pm
Chaganti Koteswara Rao : ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు. చాగంటి కోటేశ్వరరావు ఇటీవలే టీటీడీ ధార్మిక సలహాదారుగా నియమితులయ్యారు. ఈ క్రమంలో చాగంటిని సీఎం జగన్ సత్కరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను ఆయనకు అందజేశారు.
ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాస ప్రాంగణంలో ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు సందర్శించారు. గోశాలను ఆసాంతం పరిశీలించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు చాగంటి కోటేశ్వరరావు. చాగంటి వెంట శాంతా బయోటెక్ లిమిటెడ్ ఫౌండర్, ఎండీ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి కూడా ఉన్నారు.
బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు తెలియని వారుండరు. ఆయన పేరు వినని వారుండరు. తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనకర్తగా సుపరిచితులు. ప్రవచనకర్తగా హిందూ ధర్మ పరిరక్షణ కోసం చాలాకాలంగా కృషి చేస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలతో సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న విశిష్ట వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు. టీటీడీ ఆయనకు కీలక బాధ్యత అప్పగించింది. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా ప్రఖ్యాత ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావును నియమించారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమించడం ఇదే తొలిసారి. టీటీడీకి సంబంధించినంత వరకు ఇది అత్యుత్తమ పదవి.
చాగంటి కోటేశ్వరరావు.. అష్ఠాదశ పురాణాలను అధ్యయనం చేశారు. తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలు చెబుతుంటారు. ప్రవచనాలను అలవోకగా వివరించగల శక్తి సామర్థ్యాలు ఆయన సొంతం. హైందవ ధర్మ వ్యాప్తికి తన పరిధి మేర కృషి చేస్తున్నారాయన.







