UPDATED 9th FEBRUARY 2022 Wednesday 04:30 PM
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్): రాష్ట్రాలకు పన్నుల వాటా పంచకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని వైసీపీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. బుధవారం విజయసాయి రెడ్డి రాజ్యసభలో ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో ఎలాంటి పసలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ బడ్జెట్ లో ప్రతిపాదనలు ఏమి లేవని.. ఇది ఎంతో అధ్వాన్నమైనదగా ఉందటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నచందంగా కేంద్ర బడ్జెట్ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆత్మ నిర్భర భారత్ అంటున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రాల ఆత్మనిర్భరత అవసరం లేదా ? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. 41 శాతం పన్నుల వాటా రాష్ట్రాలకు పంచాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని అయితే సెస్, సర్ చార్జీల వల్ల రాష్ట్రాలకు దక్కుతున్నది 29 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సెస్, సర్ చార్జీలు పెంచుతోందని ఆరోపించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా ఏపికి ఏడాదికేడాది తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డి.. ఏపీ పై కేంద్రం సవతి తల్లి ప్రేమ కనబరుస్తోందని అన్నారు.
ఆర్థిక సంఘం ఫార్ములా వల్ల జనాభా నియంత్రణలేని రాష్ట్రాలు ప్రయోజనం పొందుతున్నాయని.. జనాభా నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోతున్నాయని ఆయన వివరించారు. సింగిల్ ఐటిఐఆర్ ఫారం ప్రవేశపెట్టి పన్నుల ఫైలింగ్ విధానాన్ని సరళీకృతం చేయాలని విజయసాయిరెడ్డి సూచించారు. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పన్ను మినహాయింపులు ఇవ్వాలని సూచించారు. లోపభూయిష్టంగా కాంగ్రెస్ విభజన చట్టం చేస్తే.. దానిని బీజేపీ ప్రభుత్వం అడ్వాంటేజీగా తీసుకుందని.. రాష్ట్రాల విషయంలో కేంద్రానిది – నో సబ్ కా సాత్, నో వికాస్, నో విశ్వాస్, నో ప్రయాస్ అంటూ వైసీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.







