UPDATED 13th MAY 2022 FRIDAY 11:00 AM
Police Suicide: తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని పోలీస్ ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కాకినాడ జిల్లా సర్పవరం పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ గోపాలకృష్ణ తన ఇంటిలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రస్తుతం కాకినాడ జిల్లా సర్పవరం పీఎస్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాలకృష్ణ..గురువారం సీఎం బందోబస్తు డ్యూటీకి వెళ్లి వచ్చాడు. ఈక్రమంలోనే శుక్రవారం తెల్లవారు జామున ఐదు గంటల సమయంలో తన సర్వీస్ రివాల్వర్ తో గోపాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితి సమీక్షించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కృష్ణాజిల్లా జగ్గయ్యచెరువుకి చెందిన గోపాలకృష్ణ 2014లో ఎస్ఐగా భాద్యతలు చేపట్టారు. అనంతరం కృష్ణ, తూర్పుగోదావరి జిల్లాల్లో విధులు నిర్వహించారు.
ప్రస్తుతం కాకినాడలో ఉంటున్న గోపాలకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గురువారం రాత్రి వరకు వీధుల్లోనే ఉన్న ఎస్ఐ గోపాలకృష్ణ, తెల్లవారేసరికి ఇలా ఆత్మహత్యకు పాల్పడడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న సర్పవరం పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.







