అన్నవరం (రెడ్ బీ న్యూస్) 11నవంబరు 2021 : కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ స్కీం అన్నవరం సత్యదేవుడి భక్తులకు వరప్రసాదమే అని ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ అన్నారు. ప్రసాద్ స్కీంకు అన్నవరం దేవస్థానం ఎంపికైన నేపథ్యంలో ఈ పథకం ద్వారా చేపట్టబోయే పనులపై ఎమ్మెల్యే, ఎంపీ గీత, దేవస్థానం ఈవో త్రినాథరావు, చైర్మన్ రోహిత్ టూరిజం శాఖ, అపిట్కో అధికారులు, దేవస్థానం ఇంజనీరింగ్ అధికారులు గురువారం సమీక్ష నిర్వహించారు. ముందుగా రూ.48.58 కోట్లకు ప్రతిపాదనలు అధికారులు సిద్ధం చేసి పంపగా తాజాగా జరిగిన సమావేశంలో రూ.70 కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని టూరిజం అధికారులు తెలిపారు. ప్రధానంగా టీటీడీ సత్రం ప్రదేశంలో రూ.300 వ్రత మండపాలు నిర్మించి అక్కడ నుంచి నేరుగా ప్రధానాలయంలో దర్శనానికి బ్రిడ్జ్ ఏర్పాటు చేసి మిగిలిన భక్తులతో కలవకుండా త్వరితగతిన దర్శనం పూర్తవుతుందని తెలిపారు. అన్నదానం బిల్డింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రింగ్రోడ్డు నిర్మాణం, పంపా రిజర్వాయర్ వద్ద బోటు షికారు, డార్మెటరీలు, సత్యగిరి కొండపై థియేటర్, కొండపై లైటింగ్ తదితర ప్రతిపాదనలు తీసుకువచ్చారు. పలు సముదాయాల్లో మరుగుదొడ్లు, స్నానపుగదులు నిర్మించాలని నిర్ణయించారు. ఈ పనులన్నీ త్వరితగతిన పూర్తిచేయడానికి చొరవ తీసుకోవాలని ఎంపీ గీత అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకం కావడంతో అవసరమైతే ఢిల్లీ వెళ్లి అనుమతులు తెప్పించేందుకు కృషి చేస్తానని, పనులు 2023 కల్లా ప్రారంభోత్సవాలు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ల్యాండ్ స్కేపింగ్, ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇదే స్కీం ద్వారా ఏర్పాటుకు అవకాశం ఉందని, అందుకే అన్ని పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని టూరిజం శాఖ ఈడీ మల్రెడ్డి చెప్పారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ మూర్తి, అన్నవరం ఆలయ సహాయ కమిషనర్ రమేష్బాబు, ఇంజనీరింగ్ అధికారులు నూకరత్నం, వి.రామకృష్ణ, డీఈలు రాంబాబు, రతన్రాజు, పీఆర్వో కొండలరావు పాల్గొన్నారు.







