అమృత్సర్ (రెడ్ బీ న్యూస్) 18 డిసెంబర్ 2021: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ మందిరంలోకి ఆగంతుకుడు చొరబడ్డాడు. మందిరంలోని గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన స్వర్ణ మందిరం భద్రతా సిబ్బంది ఆగంతుకుడిని అడ్డుకున్నారు. గురుగ్రంథ్ సాహిబ్ను అపవిత్రం చేసేందుకు యత్నించడంతో అక్కడే ఉన్న భక్తులు అతడిపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతడు అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న వెంటనే అమృత్సర్ డీఎస్పీ సంఘటనా స్థలానికి చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని అమృత్సర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రేపు శవపరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. మృతిచెందిన వ్యక్తి వయసు 20-25 ఏళ్ల మధ్య ఉంటుందని, అతడు ఎక్కడి నుంచి వచ్చాడో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.







