అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. విజయనగరం జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించింది. సదరు వ్యక్తి గత నెల 27న ఐర్లాండ్ నుంచి ముంబయి మీదుగా విశాఖ వచ్చాడు. విశాఖ విమానాశ్రయంలో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయింది. అతడి నమూనాను సీసీఎంబీకి పంపగా ఒమిక్రాన్గా తేలినట్లు వెల్లడించింది.
బాధితుడికి ఎలాంటి లక్షణాలు లేవు..
విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా మొత్తం 15 మందికి కరోనా నిర్ధారణ అయిందని.. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ సీసీఎంబీకి పంపామని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 15 మందిలో 10 మంది ఫలితాలు రాగా.. వారిలో ఒకరికి మాత్రమే ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని వెల్లడించింది. ఒమిక్రాన్ సోకిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని.. బాధితుడికి శనివారం ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కొవిడ్ నెగటివ్ వచ్చిందని తెలిపింది. ఈ విషయంపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని.. దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించింది. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని కోరింది.







