UPDATED 8th SEPTEMBER 2022 THURSDAY 07:00 PM
Thiruchanuru : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ పద్మావతి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయం నుండి యాగశాలకు వేంచేపు చేశారు.
ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు ద్వారతోరణ ధ్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ట, పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుండి 3.30 గంటల వరకు శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, కొబ్బనీళ్లతో, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
కంకణభట్టార్ శ్రీ వేంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, ఏఈవో శ్రీ ప్రభాకర్రెడ్డి, అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీ మధు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ దామోదరం తదితరులు పాల్గొన్నారు.







