కాకినాడ (రెడ్ బీ న్యూస్) 17 నవంబర్ 2021: జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టాల గణన వేగవంతం చేయాలని కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి జేసీలు సుమిత్కుమార్, కీర్తి, భార్గవ్తేజతో కలిసి వర్చువల్ విధానంలో సబ్కలెక్టర్లు, ఆర్డీవోలు, ఐటీడీఏ పీవోలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లతో సమీక్షించారు. వాస్తవ సాగుదారులకే నష్టపరిహారం అందేలా పారదర్శకంగా గణన చేయాలన్నారు. పెట్టుబడి రాయితీ, బీమా నిజమైన రైతులకు దక్కాలన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మండలస్థాయిలో సమన్వయ కమిటీలు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. రానున్న మూడు రోజులపాటు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే వీలుందనీ.. మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి సహాయక చర్యలను చేపట్టాలన్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలు తూ.చ. తప్పకుండా అమలు చేయాలన్నారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ అభిషిక్త్ కిషోర్, రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య, అసిస్టెంట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీఆర్వో సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.







