హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022 : నూతన సంవత్సరం పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిల్లో మద్యం విక్రయాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే రూ.172కోట్ల మద్యం అమ్ముడుబోయింది. 1.76లక్షల కేసుల లిక్కర్, 1.66లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు సంబంధిత శాఖ తెలిపింది. అత్యధికంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రూ.42.26కోట్లు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.24.78కోట్లు, హైదరాబాద్లో రూ.23.13కోట్ల విక్రయాలు జరిగాయి. డిసెంబరులో రికార్డు స్థాయిలో రూ.3,459కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. డిసెంబరులో 40.48లక్షల కేసుల లిక్కర్, 34లక్షలకుపైగా కేసుల బీర్లు అమ్ముడుబోయాయి. మొత్తంగా తెలంగాణలో 2021లో 30,222కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ఏపీలోనూ భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే రూ.124.10కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ తెలిపింది. మద్యం దుకాణాలు, బార్లలో విక్రయ సమయాన్ని గంటపాటు పొడిగించడంతో పాటు ప్రీమియం బ్రాండ్లు కూడా అందుబాటులోకి రావటంతో పెద్ద మొత్తంలో కొనుగోళ్లు జరిగినట్లు స్పష్టం చేసింది. 1,36,124 కేసుల మద్యం, 53,482 కేసుల బీర్లు విక్రయించినట్టు ఆబ్కారీ శాఖ తెలియజేసింది.







