UPDATED 10th MARCH 2022 THURSDAY 03:30 PM
AP CM Camp Office: ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద గురువారం ఉద్రిక్తత నెలకొంది. తమను ఉద్యోగాల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ వందలాది మంది బీమా మిత్రలు సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు.
రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన బీమా మిత్రలు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటుండగా..పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్తత తలెత్తింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. వైయస్సార్ బీమా పథకాన్ని నిర్వహించే బాధ్యతలు తమకు అప్పగించాలని బీమా మిత్రలు ఆందోళన చేపట్టారు. సీఎం నివాసం వైపు భారీ ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు అడ్డుకుని.. స్థానిక పోలీసు స్టేషన్కు తరలించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మమ్మల్ని మోసం చేశారని బీమా మిత్రలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల ముందు తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన జగన్.. ఇపుడు అధికారంలోకి వచ్చాక అసలు ఉద్యోగాలే లేకుండా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీమా మిత్రలను నిర్దాక్షిణ్యంగా తొలగించారన్నారు.
ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి ఇచ్చిన హామీ మేరకు వెంటనే బీమా మిత్రలందరికి ఉద్యోగాలు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.







