UPDATED 22nd JULY 2017 FRIDAY 8:00 PM
కాకినాడ : జిల్లాలో వరినాట్లు జులై నెలాఖరు నాటికి పూర్తిచేయాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జల వనరుల శాఖ సమన్వయంతో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో స్లూయిజ్లకు మరమ్మతులు చేపట్టిన కారణంగా సాగునీటి సమస్య వస్తోందని, దీనిని అధిగమించాలన్నారు. ఖరీఫ్లో 2.32 లక్షల హెక్టార్లలో వరినాట్లు వేయాల్సి ఉందని, ఇంతవరకూ 74,437 హెక్టార్లలో మాత్రమే వేశారని, దీన్నిమరింత వేగవంతం చేసేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో 1,235 మెట్రిక్ టన్నుల సూక్ష్మ పోషక పదార్థాలను పంపిణీ చేయాల్సి ఉండగా కేవలం 757 క్వింటాళ్లు మాత్రమే రైతులకు అందజేశారని, దీనిని వేగవంతం చేయాలని ఆదేశించారు. అంతర పంటలను ప్రోత్సహించాలన్నారు. కంది పంటను ప్రోత్సహించాలని, ఈ ఏడాది 48 వేల హెక్టార్లలో సాగు చేయాలన్నారు. రైతులకు రుణ పరపతిని పెంచటానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ -2 రాధాకృష్ణమూర్తి, వ్యవసాయశాఖ జేడీ కేఎస్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.







