చండీగఢ్ (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: పంజాబ్లోని అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో దైవద్రోహానికి పాల్పడ్డాడంటూ శనివారం ఓ యువకుడిని భక్తులు తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది జరిగిన 24 గంటల వ్యవధిలోపే రాష్ట్రంలోని కపుర్తలా జిల్లాలోనూ ఇదే తరహా మరో ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నిజాంపూర్ గ్రామంలోని ఓ గురుద్వారా వద్ద పవిత్ర జెండా ‘నిషాన్ సాహిబ్’ను అపవిత్రం చేసేందుకు యత్నించాడంటూ ఓ వ్యక్తిపై భక్తులు ఆగ్రహంతో దాడికి దిగి కొట్టడంతో.. అతను మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ‘పోలీసులు, ఏ ఇతర ఏజెన్సీలు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. ఈ తరహా కేసులకు పంజాబ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం సమానంగా బాధ్యత వహిస్తాయి’ అంటూ ఆ సమయంలో గురుద్వారా నుంచి ఓ ప్రకటన వెలువడినట్లు సమాచారం. దీంతోపాటు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడాలని అందులో కోరారు. దాడికి ముందే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పటికీ.. అతన్ని తమ ముందే విచారించాలంటూ స్థానికులు పట్టుబట్టారు. ఈ క్రమంలోనే పోలీసులతో వాగ్వాదానికి దిగిన వారు.. ఆ వ్యక్తిని కొట్టి చంపారు.







