తిరుపతి (రెడ్ బీ న్యూస్) 10 డిసెంబర్ 2021: తితిదేలోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎఫ్ఎమ్ఎస్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులు.. తమను తితిదే ఏర్పాటు చేసిన కార్పొరేషన్లో విలీనం చేయాలని కోరతూ గత కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం ఎదుట కార్మికులు ధర్నాకు దిగారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఉద్యోగభద్రత లేకుండా పోయిందని.. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన టైం స్కేల్ హామీని నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. అనంతరం ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్కు తరలించారు.







