UPDATED 10 MARCH 2022 THURSDAY 11:00 AM
Actress vani vishwanath To Contest From Nagari In Chitoor : ‘వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తా’నాకు ఏపీలో వేలాదిమంది అభిమానులు ఉన్నారని నటి వాణీవిశ్వనాథ్ ప్రకటించారు. నగరి నియోగకవర్గం నుంచి పోటీ చేయటం తథ్యం అనిధీమా వ్యక్తం చేసిన వాణీవిశ్వనాథ్ ఏపార్టీ నుంచి పోటీ చేస్తారో మాత్రం చెప్పలేదు.కాగా..ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. టీడీపీ నుంచి వైసీపీలో చేరి అక్కడ కూడా తన చాతుర్యంతో మాటలు తూటాలు పేల్చే రోజు నగరి నియోజవర్గం నుంచి గెలుపొందారు.
ఇదిలా ఉంటే రానున్న ఎన్నికల్లో మరి రోజా నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారా? చేసి గెలుస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీ పార్టీ అంటే ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. దీనికి తోడు ఎమ్మెల్యే రోజా నియోజక వర్గాన్ని పట్టించుకోవటంలేదనే విమర్శలు వస్తున్నాయి. అలాగే నగరి నియోజక వర్గంలో సొంత పార్టీ నేతల నుంచే ఎమ్మెల్యే రోజా వ్యతిరేకత వస్తోంది. నగరి అంటే రోజా అన్నట్లుగా మారిన క్రమంలో వచ్చే ఎన్నికల్లో నటి వాణీ విశ్వనాథ్ నగరి నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేయటం అత్యంత ఆసక్తికరంగా మారింది.
నగరి నియోజక వర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన వాణీవిశ్వనాథ్ అక్కడ తనకు అభిమానులు వేలాదిగా ఉన్నారని.. వారి కోరిక మేరకు ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం మాత్రం తథ్యమని తనకు అభిమానులతో పాటు అధిక సంఖ్యలో మహిళల ఆదరణ సైతం ఉందని కాబట్టి నేను అక్కడ గెలుస్తానని ధీమా వ్యక్తంచే శారు. పోటీ చేయటం ఖాయం కానీ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలేనని, అప్పటి పరిస్థితులను బట్టి ఏ పార్టీ అనేది ముందుగా ప్రకటిస్తానని తెలిపారు.
తన మేనేజర్ రామానుజం చలపతికి రాజకీయంగా జరిగిన అన్యాయాన్ని చూసి సహించలేక తాను ఎన్నికల బరిలో నిలవడానికి సిద్ధపడ్డానని వాణీవిశ్వనాథ్ తెలిపారు. నలుగురికి సాయం చేసే వ్యక్తికే ఇలాంటి ఇబ్బందులు వస్తే ఇక సామాన్యులకు పరిస్థితి ఏంటి అని ఆమె ప్రశ్నించారు. అందుకే నగరి నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.కాగా నటి వాణీవిశ్వనాథ్ నగరిలో శామాలమ్మ గుడిలో మొక్కులు తీర్చుకున్నారు.నగరిలోని ఒకటో వార్డులో గల శామాలమ్మ గుడివద్ద మహిళలు, కౌన్సిలర్లు వాణీ విశ్వనాథ్ కు మంగళహారతులతో స్వాగతం పలికారు.
అనంతరం వాణీ విశ్వనాథ్ శామాలమ్మకు ధూపదీప నైవేద్యాలతో మొక్కులు తీర్చుకుని నగిరి నుంచి ఎన్నికలలో ఆరంగేట్రం చేయడానికి శుభం చేకూరాలని ఈ దేవాలయానికి వచ్చానని తెలిపారు. .నగరిలో మా అమ్మమ్మ నర్సుగా పని చేసిందని నగర ప్రాంత వాసులు తనకు సుపరిచితులని నగిరిలో తమిళ సంస్కృతి ఉందని వాణీవిశ్వనాథ్ తెలిపారు.
అందుకే నగరి నుంచి పోటీ చేసి ప్రజాసమస్యలు పరిష్కరించడానికి తాను ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని అందరికి అందుబాటులో ఉంటానని ఇక్కడినుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇది ఖాయం అని వాణీవిశ్వనాథ్ తెలిపారు. ఏపార్టీ నుంచి చెప్పలేను గానీ అనివార్యమైతే ఇండిపెండెంట్ గా అయనా పోటీ చేసి తీరుతాననని తెలిపారు.







