Updated 24 January 2022 Monday 10:15 PM
అమరావతి (రెడ్ బీ న్యూస్): ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలు చేసేందుకు నడుం బిగించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రవర్ణ మహిళల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా “వైఎస్సార్ ఈబీసీ పథకం” తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిని 2022, జనవరి 25వ తేదీ మంగళవారం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. వర్చువల్ గా ఈ కార్యక్రమం జరుగనుంది. దాదాపు రాష్ట్రంలో ఉన్న 3.92 లక్షల మంది లబ్దిదారులకు రూ. 589 కోట్లు విడుదల చేయనున్నారు. లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ ఈ మొత్తాన్ని జమ చేయనున్నారు. ప్రతి సంవత్సరం రూ. 15 వేల చొప్పున వారి అకౌంట్లలో జమ చేయనున్నారు. మొత్తం మూడు సంవత్సరాల్లో రూ. 45 వేలు జమ చేయనున్నారు. ఈబీసీ నేస్తం కింద ఎవరు అర్హులో ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. క్షత్రియ, రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, ఆర్యవైశ్య ఇతర మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయనుంది. 45 నుంచి 60 ఏళ్ల లోపు పేద అగ్రవర్ణ మహిళలుఈ పథకానికి అర్హులు..
నిబంధనలివే :
వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో నెలకు రూ. 12 వేలు పరిమితిని మించకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండవద్దు. లబ్ధిదారుల పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి. మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. మాగాణి, మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.







