UPDATED 13th FEBRUARY 2022 SUNDAY 05:40 PM
అమరావతి:ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22వేల 785 కరోనా టెస్టులు చేయగా.. 749 మందికి పాజిటివ్ గా నిర్ధరణ అయ్యింది. మరో ముగ్గురు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో ఒకొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 6వేల 271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 3,28,31,785 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,697 కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,12,778. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 22,79,152. రాష్ట్రంలో ప్రస్తుతం 18 వేల 929 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, శనివారంతో(896 కేసులు, 6 మరణాలు) పోలిస్తే ఆదివారం కరోనా కేసులు, మరణాల సంఖ్య తగ్గింది.
అటు దేశంలోనూ కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. తాజాగా 45 వేల దిగువకు కొత్త కేసులు నమోదయ్యాయి. శనివారం 14.50 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయగా.. 44వేల 877 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ముందురోజు (50,407)తో పోల్చితే దాదాపు 11 శాతం మేర కేసులు తగ్గాయి. రోజువారీ పాజిటివిటీ రేటు సైతం స్వల్పంగా తగ్గి 3.17 శాతానికి చేరింది. వీక్లి పాజిటివిటీ రేటు 4.46 శాతంగా ఉంది. గత 24 గంటల వ్యవధిలో 684 మంది కోవిడ్ తో మృతి చెందారు.
కరోనా వ్యాప్తి నియంత్రణలో ఉండటంతో.. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 5.37 లక్షలకు పడిపోయాయి. యాక్టివ్ కేసుల రేటు 1.43 శాతంగా నమోదైంది. గత 24 గంటల వ్యవధిలో 1.17 లక్షలకుపైగా బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.37 శాతంగా ఉంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 48.81 లక్షల మందికి పైగా టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 172.81 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వివరాలు వెల్లడించింది.







