అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 నవంబర్ 2021: ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీజీటీ, పీజీటీలకు సాధారణ బదిలీలు చేసేందుకు ఆమోదం తెలియజేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. 2021 నవంబరు 1 నాటికి ఐదేళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారు బదిలీకి అర్హులని పేర్కొంది. ఒకే చోట పనిచేస్తూ రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఖాళీలు, సీనియారిటీ, సర్వీస్ పాయింట్లు, ఆరోగ్యం తదితర అంశాల ఆధారంగా కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు వెల్లడించింది. డిసెంబరు 31లోగా బదిలీల షెడ్యూల్ జారీ చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.







