Updated 25th December 2022 Sunday 11:10 pm
Prakasam Robbery Case : ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అర్థరాత్రి దారి దోపిడీ ఘటన కలకలం రేపుతోంది. బంగారం షాపుల్లో పని చేసే గుమాస్తాలను బెదిరించిన దొంగలు కిలో 700 గ్రాముల బంగారం, రూ.21లక్షల నగదుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. కిలోమీటర్ దూరంలో కారుని వదిలేసి పారిపోయారు. బాధితులు పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసి ఫిర్యాదు ఇచ్చారు. ఖాకీలు రంగంలోకి దిగిన ఇంటరాగేషన్ మొదలు పెట్టారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. గుమాస్తాలు చెప్పిన లెక్కలకు పోలీసుల దర్యాఫ్తుకు పొంతన కుదరకపోవడంతో అనుమానాలు వస్తున్నాయి.
నర్సరావుపేటలో బంగారం షాపుల్లో పని చేసే నలుగురు గుమాస్తాలు నంద్యాలకు వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో చోరీ జరిగింది. గిద్దలూరు మండలం దిగువమెట్ట దగ్గర దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. గుమాస్తాలను బెదిరించి బంగారం, డబ్బుతో పాటు కారుని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో కిలో 700 గ్రాముల బంగారంతో రూ.21 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తొలుత పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఖాకీలు దర్యాఫ్తు మొదలు పెట్టి దొంగలు వదిలి వెళ్లిన కారుని తనిఖీ చేయగా అందులో ఓ స్పెషల్ లాకర్ కనిపించింది. అందులో కిలో బంగారంతో పాటు రూ.14లక్షల నగదు సేఫ్ గా ఉన్నాయి. దీని గురించి పోలీసులు అడగ్గా.. గుమాస్తాలు నీళ్లు నమిలారు. దొంగలు 700 గ్రాముల బంగారంతో పాటు రూ.7లక్షలు ఎత్తుకెళ్లినట్లు మాట మార్చారు.
అయితే, కారులో సెక్యూరిటీ పర్పస్ తో స్పెషల్ లాకర్ చేయించినప్పుడు మొత్తం బంగారం, డబ్బును అందులోనే ఎందుకు ఉంచలేదన్నది పోలీసుల అనుమానం. కొంత బంగారం, డబ్బును బయట ఎందుకు ఉంచుకున్నారో తేలాల్సి ఉంది. కారుని ఎత్తుకెళ్లిన దొంగలు కిలోమీటర్ దూరంలోనే దాన్ని వదిలిపెట్టారు. చోరీ చేశాక త్వరగా పారిపోవాలనుకునే దొంగలు ఘటనా స్థలానికి దగ్గరలోనే కారుని ఎందుకు వదిలిపెట్టారన్నది మరో అనుమానం







