అమరావతి (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశ్రాంత ఐపీఎస్ అధికారి వి. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ధర్మాసనం విచారించింది. స్టీల్ ప్లాంట్ నుంచి ఎటువంటి అఫిడవిట్ దాఖలు కాలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్నే తమ అఫిడవిట్గా పరిగణించాలని యాజమాన్యం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల వల్ల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన 8 వేల మంది రైతులకు ఇంకా న్యాయం జరగలేదని.. ప్రైవేటీకరణతో భూములు ఇచ్చిన రైతుల హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ముఖ్యమంత్రి జగన్ ప్రధానికి రాసిన లేఖలో ఈ విషయాలను సూచించారని వెల్లడించారు. ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రైవేటీకరణ అవసరం ఉండదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ఈలోగా ఈ విషయంలో కేంద్రం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ముందస్తు విచారణ అడగవచ్చని ఉన్నత న్యాయస్థానం సూచించింది.







