Pawan Kalyan Delhi Tour: కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ.. పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ.. వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు

Updated 4th April 2023 Tuesday 12:50 pm

Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్ కళ్యాన్  (Pawan Kalyan) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆదివారం సాయంత్రం జనసేన పార్టీ (Jana Sena Party) రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) తో కలిసి ఢిల్లీకి చేరుకున్న పవన్.. సోమవారం పలువురు బీజేపీ నేతలతో భేటీ అయ్యారు. విదేశాంగ శాఖ సహాయమంత్రి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మురళీధరన్‌ (Muralidharan) తో పవన్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీజేపీ, జనసేన కలిసి ముందుకెళ్లే విషయంపై, కార్యాచరణపై వీరి మధ్య చర్చజరిగినట్లు తెలిసింది. అదేవిధంగా కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (Union Minister Gajendra Shekawat) తో భేటీ అయిన పవన్.. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)  విషయంపై పలు విజ్ఞప్తులు చేశారు. కాగా, మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తో పవన్, మనోహర్‌లు భేటీ కానున్నారు.

కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ .. పోలవరం ప్రాజెక్టు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర కాలయాపన చేస్తోందని, రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ సత్వరమే పూర్తి చేసేందుకు చొరవ చూపాలని పవన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ బహుళార్ధక ప్రయోజనాలు అందిస్తుందని, ఇంతటి ముఖ్యమైన ప్రాజెక్ట్ విషయంలో నిధుల కొరత పేరుతో వైసీపీ ప్రభుత్వం జాప్యం చేయడంతో నిర్మాణ పురోగతి దెబ్బ‌తింటోందని పెకావత్ దృష్టికి తీసుకువెళ్లారు. 2019 మే నాటికి పోలవరం ప్రాజెక్ట్ పనులు 72శాతానికి పైగా పూర్తయితే గత నాలుగేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కేంద్రం మంత్రి వద్ద ప్రస్తావించారు.

విశాఖ పారిశ్రామిక జోన్‌కు అవసరమైన నీటినీ, విశాఖ మెట్రో నగరానికి తాగు నీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోయాయని పవన్ అన్నారు. ప్రాజెక్ట్ పనులు ముందుకు వెళ్లకపోవడంపై వైసీపీ ప్రభుత్వం కేంద్రంపై నిందలు వేస్తోందని షెకావత్ కి తెలిపారు. పోలవరం నిర్వాసితులకు అందించాల్సిన ఆర్అండ్ఆర్ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన శ్రద్ధ చూపడం లేదన్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు, మిగిలిన 24శాతం పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు కేంద్రం చొరవ తీసుకుని నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రాజెక్ట్ మూలంగా విశాఖపట్నం, గోదావరి జిల్లాల తాగు నీరు, పారిశ్రామిక అవసరాలతోపాటు గోదావరి డెల్టాలోనే కాకుండా పక్కనే ఉన్న కృష్ణా డెల్టాలోని రైతాంగానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని పవన్ చెప్పారు. ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు అందించడంతోపాటు ఈ నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ తక్షణ జోక్యం అవసరమని పవన్ కళ్యాణ్ సూచించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us