హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: సాహితీరంగంలో అత్యంత పేరు ఉన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నట్టు బుక్ ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు జూలూరి గౌరీ శంకర్ తెలిపారు. పది రోజులపాటు సాగే ఈ బుక్ ఫెయిర్లో దాదాపు 260కిపైగా స్టాల్స్ ఉంటాయని చెప్పారు. చిన్నారులు, మహిళలు సహా అన్ని వర్గాల వారిని ఆకర్షించేలా పుస్తకాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ఏడాది ప్రత్యేకంగా పర్యావరణంపై ప్రసంగాలను సైతం ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఎప్పటిలాగే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలోనే బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో పెద్ద ఎత్తున పుస్తక ప్రియులు పాల్గొనే అవకాశమున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని కమిటీ అధ్యక్షుడు గౌరీ శంకర్ వెల్లడించారు.







