UPDATED 17th FEBRUARY 2022 THURSDAY 07:15 PM
Kodali Nani : టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఇక జన్మలో చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరని జోస్యం చెప్పారు. ఏపీ ధాన్యం కిలో రూ.25కే విదేశాలకు ప్రభుత్వం ఎగుమతి చేస్తోందనే ఆరోపణలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబును సీఎం చేయాలనే ఓ వర్గం మీడియా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్పై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం జగన్పై బురద జల్లడమే ఓ వర్గం మీడియా పనిగా పెట్టుకుందని, ప్రతి రోజూ ఏదో ఒక తప్పుడు కథనం రాస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని.
కాకినాడ పోర్టు నుంచి అనేక రాష్ట్రాల ధాన్యం ఎగుమతి అవుతోందని తెలిపిన మంత్రి.. ధాన్యం ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టుది అగ్రస్థానమని చెప్పారు. రైతులు పండించే పంటల వివరాలు ఈ క్రాప్ యాప్లో ఉంటాయని, అన్నీ రికార్డులు ఆన్ లైన్ లో ఉంటాయని వివరించారు. సన్నబియ్యం ఎగుమతిలో ఎలాంటి అవినీతి జరగలేదని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ఒక్క ఏపీ నుంచే కాదని.. బీహార్, ఒరిస్సా, తమిళనాడు, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతి అవుతోందన్నారు.







